నేటి రాత్రి 11 గంటల నుంచి హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ల మూసివేత.. మద్యం తాగి వాహనం నడిపితే జేబులకు చిల్లు!

  • రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్ల మూత
  • అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • తాగి వాహనం నడిపి పట్టుబడితే తొలిసారి రూ. 10 వేల జరిమానా
  • ప్రమాదానికి కారణమై వ్యక్తి మృతి చెందితే పదేళ్ల జైలు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మద్యం తాగి వేగంగా వాహనాలు నడిపి, ప్రమాదాల బారినపడే అవకాశం ఉండడంతో రాత్రి 11 గంటల తర్వాత హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్లను మూసివేస్తామని రాచకొండ, సైబరాబాద్ సీపీలు మహేశ్ భగవత్, సజ్జనార్‌లు తెలిపారు.

అలాగే, మూడు కమిషనరేట్ల పరిధిలోనూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు. హోంగార్డులు, ఏఆర్‌ పోలీసులు, సీపీ వరకు అధికారులు అందరూ తనిఖీల్లో పాల్గొంటారని సజ్జనార్‌ చెప్పారు. ఫ్లై ఓవర్లను మూసివేయనున్న పోలీసులు విమాన టికెట్లు కలిగిన వారిని మాత్రం ఓఆర్ఆర్‌పైకి అనుమతిస్తారు.

తాగి వాహనం నడిపి పట్టుబడితే శిక్షలు ఇలా..

నేడు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాలను జప్తు చేస్తారు. మొదటి శిక్షగా 10 వేల రూపాయల జరిమానా విధిస్తారు. లేదంటే 6 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే రూ. 15 వేల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష తప్పదు. తాగి వాహనం నడుపుతూ ఇతరుల మృతికి కారణమైతే పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.

Hyderabad
New year
Liquor
Fly overs

More Telugu News